నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ఐటీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీకి ఆనుకుని ఉన్న కొండను అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. వారం రోజులకు పైగా కొండను ఆక్రమించే పనులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు గానీ, సిబ్బంది గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మండలంలోని రేగుంటకు చెందిన ఓ వ్యక్తి కొండను ఆక్రమించి మామిడి మొక్కలు వేశాడు. దీనిపై కొండను ఆనుకుని ఉన్న జగనన్న కాలనీ వాసులు అభ్యంతరం చెప్పగా తనకు పట్టా ఉందంటూ చెబుతున్నట్లుగా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. అయితే గట్టుకు సంబంధించి ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని రెవెన్యూ సిబ్బంది పేర్కొన్నారు. స్థానికులు సమాచారంతో వీఆర్ఓ సుబ్బారావు కొండ వద్దకు వెళ్లి ఆక్రమణదారుడితో మాట్లాడి ఆక్రమించుకోవడానికి వీల్లేదని చెప్పా రు. అంతేగాకుండా ఆక్రమణను తొలగించాలని లేఖను సైతం ఆర్ఐ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆక్రమణదారుడికి కొందరు అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తున్నట్లు సమాచారం.


