కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ.. నీ చల్లని దీవెనలందించమ్మా. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం పెద్దింట్లమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలాచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఒక్క ఆదివారమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ. 62,445 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
గణపవరం: గణపవరం బస్టాండు ఏరియాలో శనివారం రాత్రి ఓ చుక్కల దుప్పి ప్రత్యక్షమైంది. దీనిని గుర్తించిన స్థానికులు గణపవరం పోలీసులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. బస్టాండు వద్ద నుంచి వెంకయ్య కాల్వ గట్టు వెంబడి చెట్ల మధ్యలో ఈ జింక సంచరిస్తూ కనిపించింది. దీనిని గమనించిన స్థానిక యువకులు సలాది అజయ్, చిలకా రమేష్లు చాకచక్యంగా దానిని బంధించారు. గణపవరం ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వచ్చి, దుప్పిని బస్టాండు వద్దనున్న శివాలయం ఆవరణలో సురక్షితంగా ఉంచారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం గణపవరం వచ్చిన భీమవరం రేంజ్ ఫారెస్ట్ అధికారి ఎం.కరుణాకర్ సదరు చుక్కల దుప్పిని పరీక్షించి ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. దీనిని నిర్దేశిత పద్ధతుల ద్వారా తరలిస్తామన్నారు. సహజంగా ఇది చాలా బెదురు జంతువని, ఎక్కువ భయానికి లోనైతే శ్రీక్యాప్చర్ మయోపతిశ్రీకి గురై చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. రాజమండ్రి ప్రాంతీయ వన్యప్రాణి సంరక్షణ మరియు చికిత్స కేంద్రం సిబ్బంది వచ్చి దీనికి మత్తు ఇచ్చి, సోమవారం ఉదయమే అటవీ ప్రాంతానికి తరలిస్తామని ఆయన తెలిపారు. జనసంచారం, కేకల వల్ల జంతువు భయపడే ప్రమాదం ఉందన్న అటవీ అధికారుల సూచనతో ఎస్సై మణికుమార్ ఆ ప్రాంతంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.


