సర్వజన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సర్వజన కష్టాలు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

న్యూస్‌రీల్‌

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, అనుబంధ బోధనాస్పత్రి (జీజీహెచ్‌)లో సర్వజన కష్టాలు వర్ణణాతీతం. అత్యాధునిక వైద్య చికిత్సలు అందుతాయనే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రొఫెసర్లు తమ నైపుణ్యంతో సామాన్యులకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తారని ఆశించగా భంగపాటు తప్పలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోగులు, సహాయకులకు సదుపాయాల కల్పనలోనూ వైద్య అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి జీజీహెచ్‌లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో వైద్యసేవల్లో డొల్లతనం బయటపడింది.

సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో రోగు లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ సు మారు 1,800 నుంచి 2 వేల మంది వరకూ ఓపీ, అత్యవసర సేవలకు వస్తుంటారు. అయితే నిపుణులైన వైద్యులు ఉన్నా రోగులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందనే అపవాదు ఉంది. ఒకవైపు రో గులు ఓపీ సేవలకు వేచి ఉంటే.. వైద్యులు మాత్రం ప్రత్యేక మీటింగుల పేరుతో ఓపీ గదుల్లో ఉండటం లేదు. రోగులు వచ్చి చూస్తే వైద్యులు కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇదేంటని అడిగే పరిస్థితి లేదు. దంతవైద్య విభాగం, ఈఎన్‌టీ విబాగంలో, జనరల్‌ మెడిసిన్‌ ఇలా ఆయా విభాగాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవటంతో వైద్యసేవలు అందే పరిస్థితి లేదు.

ఎంసీహెచ్‌ బ్లాక్‌లో గర్భిణుల కష్టాలు

జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌లో పలు సమస్యలు గర్భిణులు, బాలింతలను వేధిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి గర్భిణులు వైద్యసేవలకు వస్తూంటారు. గర్భిణులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కనీసం ఒక ఫ్యాన్‌ కూడా ఉండదు. సూర్యరశ్మి కోసం పైకప్పులో ఫైబర్‌ గ్లాస్‌ ఉండటంతో నేరుగా పైనుంచి ఎండవేడిమి వస్తూ ఉంటుంది. తీవ్ర ఉక్కపోతతో గంటల తరబడి వేచి ఉంటూ అనారోగ్యం బారిన పడుతున్నారని గర్భిణుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కానింగ్‌ ప్రాంతంలోనూ ఎండవేడిమి రావటంతో గర్భిణులు, బాలింతలకు అవస్థలు తప్పటం లేదు.

నిలువ నీడ లేదు

ఎంసీహెచ్‌ విభాగంలో గర్భిణులు వైద్యచికిత్సలకు వస్తే... వారి కుటుంబ సభ్యులు, సహాయకులకు ని లువ నీడలేకుండా పోయింది. ఏదో ఒకటి, రెండు చెట్ల నీడన ఆశ్రయించాల్సిన దుస్థితి. ఇటీవల ఎండలతో విపరీతమైన వేడి వస్తుండటంతో సహాయ కులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ గోడలు, చె ట్లకింద కూర్చోవాల్సి వస్తుందనీ, కనీసం వెయిటింగ్‌ రూమ్‌ కూడా లేదని వాపోతున్నారు.

నిరుపయోగంగా వెంటిలేటర్‌ పరికరాలు

కరోనా విపత్తు సమయంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సహాయంతో వైద్య చికిత్సలు అందించాల్సి వచ్చేది. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రికి భారీఎత్తున వెంటిలేటర్‌ పరికరాలు సమకూర్చా యి. యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్స్‌ సైతం ఏర్పాటుచేశారు. అయితే నేడు వైద్య అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరితో రోగులకు సరైన వైద్యసేవలు అందటం లేదనే ఆరోపణలు ఉన్నా యి. విలువైన వెంటిలేటర్‌ పరికరాలను నిరుపయోగంగా పడవేయటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా ప్రస్తుతం జీజీహెచ్‌లో ఆరుగురు వెంటిలేటర్‌ టెక్నీషియన్లు అందుబాటులో ఉండగా... సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నా రని అంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో రోగులు వస్తే వెంటనే విజయవాడ, గుంటూరుకు రిఫర్‌ చేస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

సర్వజన ఆసుపత్రిలో ఈఎన్‌టీ విభాగంలో ఖాళీగా సీట్లు

ఎంసీహెచ్‌ బ్లాక్‌లో స్కానింగ్‌ కోసం ఇలా..

పడకేసిన వైద్యం

ఏలూరు జీజీహెచ్‌లో సేవలు నిల్‌

ఓపీ వేళల్లో మీటింగుల పేరుతో సీట్లు ఖాళీ

ఉక్కపోతలో ఎంసీహెచ్‌ బ్లాక్‌లో గర్భిణులు

నిరుపయోగంగా వెంటిలేటర్లు

ఆరుబయట సహాయకుల పడిగాపులు

Advertisement
 
Advertisement
Advertisement