దెబ్బతింటున్న మామిడి తోటలు
ఆగిరిపల్లి: మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ అధికార పార్టీకి చెందిన నేతలు పచ్చని కొండలను సైతం తవ్వేసి పిండి చేసేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా లారీల్లో గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని తోటపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి సరిహద్దుల్లో ఉన్న అర్లగట్టులో గ్రావెల్ తవ్వుకోవడానికి మైనింగ్ శాఖ నాలుగు హెక్టార్లలో అనుమతులు ఇచ్చిందంటూ గత రెండు నెలలుగా గన్నవరంనకు చెందిన అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వి తరలించుకుపోతున్నారని తోటపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలతో తోటపల్లి పరిధిలో ఉన్న మామిడి తోటలు నాశనమై పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముతో మామిడికాయలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మూడు గ్రామాలకు చెందిన రైతులు ఆర్లగట్టుపై తమ పశువులను మేత కోసం తోలేవారు. కానీ ఇప్పుడు గట్టుపై గ్రావెల్ తవ్వకాలతో పశుగ్రాసం కొరత ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం లారీల రాకపోకలతో రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆర్లగట్టు సమీపంలోనే గతంలో అనుమతులకు మించి గ్రావెల్ తవ్వేయడంతో మైనింగ్ శాఖ అధికారులు వారిపై రూ.2 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే అర్లగట్టుపై కూడా అనుమతులకు మించి తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే గ్రామస్తులు అంతా కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
గ్రావెల్ తవ్వకాలతో మామిడి తోటలు తీవ్రస్థాయిలో దెబ్బతింటున్నాయి. మైనింగ్ తవ్వకాలకు వచ్చే దుమ్ముకు మామిడికాయలు రంగు మారిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలి
– సింహాద్రి నాగబాబు, తోటపల్లి


