ఏలూరు టౌన్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఫిట్ఫర్ ఎస్ఐ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షలు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని శ్రీ సురేష్చంద్ర బహుగుణ స్కూల్లో ప్రశాతంగా జరిగాయి. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు. పేపర్–1 పరీక్షకు మొత్తం 112మంది హాజరుకాగా, వారిలో మహిళలు 29మంది, పురుషులు 83మంది ఉన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, పటిష్టమైన ఏర్పాట్లు మధ్య పరీక్షలు సాగుతున్నాయని తెలిపారు. బుధవారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పరీక్షలకు హాజరైన సిబ్బందికి టర్న్ అవుట్, స్వ్కాడ్ డ్రిల్, ఆర్మ్స్డ్రిల్, ఆయుధాల కోల్నా జోల్నా, వైవా, నేరస్థల పరిశీలన, నేర స్థలంలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో శిక్షణ అనంతరం వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు లభిస్తాయని ఐజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, పోలవరం డీఎస్పీ యం.వెంకటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాద్, డీఏఆర్ అదనపు ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్జోన్ డీఎస్పీ బీ.విద్య, డీఏఆర్ డీఎస్పీ బీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


