భీమడోలు: భీమడోలు పోలీసులు ఆదివారం వినూత్న సేవా కార్యక్రమం చేపట్టారు. గతంలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి రికవరీ చేసిన సెల్ఫోన్లను వారికి అందించారు. భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషాతో కలిసి సీఐ వి.కృష్ణలు ఆర్జావారిగూడెంలోని ఇద్దరు బాధితుల గృహాల వద్దకు వెళ్లి వాటిని అందించగా, వారంతా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని పలు విభాగాల పనితీరు, ఆన్లైన్ విధానం గురించి వారికి సీఐ అవగాహన కల్పించారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఫోన్లు వెతికి పట్టుకుని వాటిని తమకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫోన్లు పొగొట్టుకుంటే తిరిగి రాదనే ఆపోహ ఉండేదని, కానీ పోలీసు ఉన్నతాధికారులే తమ ఇళ్లకు వచ్చి వాటిని అందజేయడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మొబైల్ ఫోన్లు ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాల మేరకు బాధితులకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నరసాపురం రూరల్: స్థానిక కెనాల్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 3న శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, డీజే పోగ్రామ్లతో భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి స్నానాల కార్యక్రమం అత్యంత వైభవంగా చేశారు.


