భీమడోలు: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మానస పాఠశాలలో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికిల్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ క్యాంపులోని పలు విభాగాలను వాసుబాబు, మానవత జిల్లా అధ్యక్షుడు కండేపు వెంకట సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ ఆసుపత్రి గుండె, క్యాన్సర్ ఆసుపత్రి, సరస్వతి ఎముకల ట్రామా కేర్, వేమగిరి కంటి వైద్య ఆసుపత్రిలకు చెందిన వైద్యులు వచ్చి రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఆయన విభాగాల్లో రోగులకు చేస్తున్న పరీక్షలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. సేవాభావంతో మానవత సంస్థ చేస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారిని అభినందించారు. 350 మంది రోగులకు పలు పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. 47 మందికి కళ్లజోళ్లు వేశారు. ఏడుగురికి కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు. 65 మందికి గుండె పరీక్షలు చేశారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎముకల వైద్య నిపుణులు అక్కెం నరేష్, తాజా మాజీ సర్పంచ్ పాము సునీతామాన్సింగ్, పాఠశాల ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రామిశెట్టి గంగాధర్, పంచకర్ల సత్యనారాయణ, చిలపర్తి ఆదినారాయణ, గోనుగుంట రమణ శంకర్, పసుపులేటి సాంబశివరావు, తుమ్మల ఉమామహేశ్వరరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, చిలపర్తి రామారాయుడు తదితరులు పాల్గొన్నారు.


