ద్వారకాతిరుమల: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో చిన్న వెంకన్న క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. 104 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉంటే అనివేటి మండపంలో పలు భజనమండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రం భక్తుల రద్దీ కొనసాగింది.
నిత్య కల్యాణంలో పాల్గొన్న 104 జంటలు


