ఏలూరు(టూటౌన్): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గోదావరి మండల పరిధిలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఫణి కుమార్ తెలిపారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 8న మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానంలో కిసాన్ మేళా నిర్వహిస్తారన్నారు. మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం అంశంపై కిసాన్ మేళా జరగనుందన్నారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు హాజరవుతారన్నారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ యాంత్రీకరణ, వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రదర్శన శాలలను ఏర్పాటు చేస్తారన్నారు. రైతులకు నూతన వరి రకాల ప్రదర్శన, క్విజ్ పోటీ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో కిసాన్ మేళాకు హాజరుకావాలన్నారు.


