ఏలూరు (టూటౌన్): కనీస వేతనాల చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పి శ్రీనివాసులురెడ్డి ఆదేశించారు. బుధవారం ఏలూరులోని హోటల్ అతిథిలో సంయుక్త కార్మిక కమిషనరు ఎ.గణేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనీస వేతనాల పెంపుదలపై యజమానుల సంఘాల నుంచి, కార్మిక సంఘాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాల చట్టాన్ని అందరూ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆహ్వానించ దగ్గ పరిణామమన్నారు. సలహా మండలి కూర్పు నందు జాతీయ కార్మిక సంఘాలకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో మండలి సభ్యులు ఆర్ శ్యామ్, డి.పుల్లయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు,కార్మిక నాయకులు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల ఉపకార్మిక కమిషనర్లు, సహాయ కార్మిక కమిషనర్లు, ఏలూరు సహాయ కార్మిక అధికారులు పాల్గొన్నారు.


