ఏలూరు (టూటౌన్): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ కలెక్టరేట్ వద్ద క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్)లుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మతం మార్చుకున్న కారణంగా దళితులకు రాజ్యాంగ పరమైన హక్కులు దూరం కావడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులు సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగానే ఉన్నప్పటికీ వారికి సరైన రక్షణ, సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. అలాగే ప్రార్థనా మందిరాలపై, క్రైస్తవులపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. మత మార్పిడి నిరోధక చట్టాలు ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని పేర్కొంటూ వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్ఓ విశ్వేశ్వరరావుకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డా.మెండెం సంతోష్ కుమార్, క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కౌన్సిల్ సభ్యులు, వివిధ చర్చి ప్రతినిధులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


