కై కలూరు: గేదెలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై సింగాపురం వద్ద చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల పెదరాముడు(49) కై కలూరు నుంచి గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. సింగాపురం వచ్చేసరికి రోడ్డుపై గేదెలు కొట్టుకుంటూ రావడంతో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. స్థానికులు అతడ్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెదరాముడు కుమారుడు హరిశ్చంద్రరావు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
చింతలపూడి: ఆలయంలోని హుండీ పగలగొట్టి చోరీకి పాల్పడుతున్న దొంగను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చింతలపూడి మండలంలోని ఫాతిమాపురం గ్రామానికి చెందిన చార్లెస్ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున గ్రామంలోని చెక్పోస్ట్ వద్ద గల గుడిలోకి చొరబడ్డాడు. హుండీని పగలగొట్టి నగదు అపహరించేందుకు ప్రయత్నిస్తుండగా, గమనించిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని స్టేషన్న్కు తరలించి విచారిస్తున్నట్లు ఎస్సై కె సతీష్ కుమార్ తెలిపారు.


