ఏలూరు (ఆర్ఆర్పేట) : మహిళల సాధికారతకు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని, వాటిని వినియోగించుకుని బలోపేతం కా వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు రూ.1,398 కోట్లను బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేశామన్నారు. మహిళలు ఆపద సమయంలో 181, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చన్నారు. పనిచేసే ప్రదేశంలో మహిళల భద్రతకు ఆయా కార్యాలయాల్లో సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి జయశర్మ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పీఓ కె.అనురాధ, డీఎంహెచ్ఓ శోభ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్వీ నాగరాణి, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ, ఆర్టీసీ డీపీటీఓ షేక్ షబ్నం, వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, తహసీల్దార్ కె. గాయత్రి తదితరులు పాల్గొన్నారు. పలు రంగాల్లో సేవలందించిన, విజయాలు సాధించిన మహిళలను కలెక్టర్ సత్కరించారు.


