
కల్తీ విత్తనాలతో జాగ్రత్త!
బుట్టాయగూడెం : తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాలు కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కల్తీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు ఎరువుల నియంత్రణ చట్టం– 1985 ప్రకారం నిబంధలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
విత్తనాల కొనుగోలులో..
వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన సంస్థల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ వేసిన ధృవీకరణ పత్రం ఉన్న విత్తన బస్తాలనే కొనుగోలు చేయాలి. విత్తనాల సంచిపై విత్తనాల రకం, ల్యాబ్ నెంబర్, గడువు తేదీ, తదితర విషయాలను గమనించాలి. కొనుగోలు చేసిన బిల్లుపై డీలర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. హైబ్రిడ్ విత్తనాల కొనుగోలుకు విత్తన రకం, స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యు నాణ్యత వంటి వివరాలు పరిశీలించాలి. మొలకెత్తిన దశ, పూత దశలో లోపం కనిపిస్తే స్థానిక వ్యవసాయ అధికారులను, సిబ్బందిని సంప్రదించాలి.
మొలకలను పరీక్షించే విధానం
రైతులు విత్తుకోవడానికి ఒకరోజు ముందు విత్తనాలను కొనుగోలు చేయడం వల్ల మొలక పరీక్షలు చేయించుకోవడం లేదు. విత్తనం కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా మొలకలను పరీక్ష చేయించుకోవాలి. రైతు కొనుగోలు చేసిన విత్తనాల సంచి నుంచి 100 గింజలను 24 గంటలపాటు నీటిలో నానబెట్టి అనంతరం ఒక గుడ్డలో గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచాలి. 24 గంటల తర్వాత తీసి చూస్తే 100 గింజలకు 75 గింజలపైనే మొలక వస్తే మంచి విత్తనంగా నిర్ధారించుకుని నారుమడులు సిద్ధం చేసుకోవాలి. మొలక శాతం కనీసం 75 శాతం వరకూ ఉంటే విత్తనాలు నాణ్యమైనవని భావించి పంటలు విత్తుకోవాలి.
గడువు దాటితే కొనుగోలు చేయొద్దు
కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా డబ్బాపై సీలు ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
మంచి విత్తనాలతోనే నారు కట్టాలి
సొంతంగా తయారు చేసిన విత్తనాలు నారుకు శ్రేయస్కరం. కొనుగోలు చేస్తే మంచి విత్తనాలను ఎంపిక చేయాలి. నారుపోసే ముందు మొలక శాతం గుర్తించి నారు పోయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
– పీజీ బుచ్చిబాబు,
సహాయ వ్యవసాయ సంచాలకుడు, కేఆర్పురం
రైతులకు వ్యవసాయాధికారుల సూచన

కల్తీ విత్తనాలతో జాగ్రత్త!