
కొంతేరులో మహిళ ఆత్మహత్య
యలమంచిలి: కొడుకు ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు ప్రియురాలి కుటుంబ సభ్యులు కోర్టు కేసులు వేసి తనను వేధిస్తున్నారని.. కడుపు కోతను, కోర్టు కేసులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి మహిళ శనివారం కొంతేరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మృతదేహాన్ని ప్రియురాలి ఇంటి ముందు ఉంచి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన చింతా లక్ష్మీ నర్సమాంబ భర్త చనిపోవడంతో పుట్టిల్లు కొంతేరు వచ్చి స్థిరపడింది. ఇద్దరు కుమారులను కష్టపడి ఇంజినీరింగ్ చదువించింది. వారిలో లికిల్ సాయి సమీపంలో ఉంటున్న అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరికి గొడవ జరగడంతో వీడియో కాల్లో ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉరి వేసుకుని గత డిసెంబరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో తన కుమార్తెను అల్లరిపాలు చేస్తున్నారంటూ ఆ అమ్మాయి తండ్రి వారిపై పోక్సో కేసు నమోదు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు కొడుకు మరణం, మరోవైపు కోర్టు కేసులతో నర్సమాంబ మనస్తాపం చెంది శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు అడ్డాల నాగేశ్వరరావు కుటుంబమే కారణమని ఆరోపిస్తూ నర్సమాంబ సూసైడ్ నోట్ రాసింది. ఈ సంఘటనపై ఎవరూ పిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
కుమారుడి ప్రియురాలి ఇంటిముందు
మృతదేహంతో ఆందోళన