
ఆకలి నుంచి, అగడ్తల నుంచి, వేధింపుల నుంచి, ఘర్షణల నుంచి, మృత్యువు నుంచి సుదూరంగా వెళ్లిపోవడానికీ, సురక్షితంగా బతకడానికీ సాధారణ ప్రజానీకం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచంలో అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. ప్రతి దేశంలోనూ జాతీయవాద ధోరణులు పెరిగి, మెజారిటీ వాదం ముదిరి సరిహద్దులు మూసుకుపోతున్నా బతుకుపోరులో పరాజితులవుతున్న సాధారణ జనం ఎప్పటిలా ‘వలస గీతం’ పాడుతూనే ఉన్నారు. నిరుడంతా ఒక దేశం నుంచి మరో దేశానికి కోట్లాదిమంది ప్రజానీకం వలసపోయారని లాన్సెట్ నివేదిక ప్రకటించింది. ఒక్క మాటలో– ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్వస్థలాలను వదిలిపోతున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో సమస్య.
నియంత పోకడలతో ఉండే పాలకులు కావొచ్చు... సాయుధ ముఠాల బెదిరింపుల వల్ల కావొచ్చు, కళ్లముందు జరుగుతున్న ఘర్షణలు ముదిరి తమను కూడా కబళిస్తాయన్న భయం కావొచ్చు–ఎందరెందరో సురక్షిత ప్రదేశాలను అన్వేషిస్తూ తెలియని తీరాలకు పయనమవుతున్నారు. వీటికి తోడు ఈ 21వ శతాబ్దంలో వాతావరణ మార్పుల కారణంగా వచ్చిపడుతున్న సమస్యలు కూడా వలసలను పెంచుతున్నాయని లాన్సెట్ నివేదిక సూచిస్తోంది. భారీ ఆనకట్టల నిర్మాణం, మైనింగ్, పరిశ్రమల స్థాపన వంటì వాటికి అభివృద్ధి పేరిట అనుమతులిస్తున్నారు. ప్రభుత్వాలు నామమాత్రంగా ఇచ్చే పరిహారం ఏ మూలకూ చాలక, చేసేందుకు పనులేమీ లేక వలసలు తప్పటం లేదు.
ఇలాంటి ‘అభివృద్ధి’ పర్యవసానంగా కరువు, వరదలు, ఇతరేతర ప్రకృతి వైపరీత్యాలు కాటేస్తు న్నాయి. ఆహారం, మంచినీరు సంగతలా ఉంచి కనీసం తలదాచుకోవటానికి కూడా ఏమీ మిగలక పోవటం సమస్యాత్మకం అవుతోంది. ఇలాంటివారిని స్వదేశంలోనే సంశయంతో చూస్తారు. తమ వనరులు కాజేస్తారని, జీవికకు ముప్పు తెస్తారని ఆందోళన పడతారు. పరాయి దేశాలకు పోతే చెప్పేదేముంది? మన దేశం వరకూ చూస్తే వలసల్లో దాదాపు 99 శాతం అంతర్గతమైనవేనన్నది నిపుణుల మాట. ఉత్తరప్రదేశ్, బిహార్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు అధికంగా ఉంటుండగా, వారికి ఆశ్రయమిచ్చే రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్రలది అగ్రస్థానం.
వలసపోయే వారిలో ఇతరేతర సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలు కూడా తక్కువేమీ కాదు. ఎండనక, వాననక, తిండితిప్పలు లేక గత్యంతరం లేక కాలినడకన వెళ్లేవారుంటారు. ఎగిసిపడు తున్న అలలు కలవరపరుస్తున్నా, ఏ క్షణమైనా మింగేస్తాయన్న భయాందోళనలున్నా నాటుపడవ లపై సముద్రాలను దాటాలని చూసేవారూ ఉంటున్నారు. ఇలాంటివారంతా వ్యాధుల బారినపడి ఆదరించేవారు లేక, వైద్యసాయం అందక మృత్యుముఖంలోకి పోతున్నారు. తొలుత 2008లో, ఆ తర్వాత 2017లో ఐక్యరాజ్యసమితి ఈ సమస్యపై తీర్మానాలు చేసింది.
ప్రత్యేకించి వలసదారుల ఆరోగ్యావసరాలను చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలకు సూచించింది. అయిదేళ్ల క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆ సంస్థలో దీనిపై శ్రద్ధపెట్టి పనిచేసే విభాగాలు ఆర్థిక సమస్యలతో మూతబడ్డాయి. వలసదారుల్ని చూసి భయపడే సాధారణ ప్రజానీకం, దీన్ని తమకనుకూలంగా మార్చుకుని అధికారం అందుకోవాలనుకునే రాజకీయ పక్షాల నాయకులు సమస్యను మరింత జటిలం చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో వలసదారుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉన్నాయి. కానీ పట్టించుకునే వారేరి? సక్రమంగా ఆలోచించి వినియోగించుకుంటే వలసదారులు ఏ సమాజాభివృద్ధికైనా తోడ్పడతారు. చాలా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే నిర్మాణరంగ, వ్యవసాయరంగ కార్మికులకు పనులు లభిస్తున్నాయి. కానీ వారి యోగక్షేమాలు పట్టక పోవటం, వారి నైపుణ్యాభివృద్ధికి అవసరమైన పథకాలు లేకపోవటం సమస్యలకు దారి తీస్తోంది.
దురదృష్టవశాత్తూ హింసనుంచీ, వేధింపులనుంచీ తప్పించుకుని వస్తున్న వలసదారుల్ని అనుమాన దృక్కులతో చూసే వైఖరి పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన మొదట్లోనే ప్రపంచ మానవ హక్కుల డిక్లరేషన్ వెలువరించింది. దానికి అనుగుణంగా 1951లో శరణార్థుల ఒడంబడిక అమల్లోకొచ్చింది. మన దేశంతోపాటు ఇండొనేసియా, క్యూబా, ఎరిత్రియా, లిబియా వంటి దేశాలు దానిపై సంతకం చేయలేదు.
అలా సంతకం చేయకపోయినా శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలనుంచి వచ్చిన శరణార్థులను భారత్ ఆదుకుంది. టిబెట్ నుంచి వచ్చిన 80,000 మంది గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఆ్రÔ¶ యం పొందుతున్నారు. కానీ ఆ ఒడంబడికను గుర్తించి సంతకం చేస్తే దానికింద శరణార్థులకు కల్పించాల్సిన తప్పనిసరి సదుపాయాలు వగైరా వుంటాయి. ఇక్కడికొచ్చినవారు వాటిని కోల్పోవాల్సి వస్తోంది.
ఎంతో సంపన్నవంతమైన అమెరికాయే వలసలను అడ్డుకోవటానికి వేలాది మందిని జైళ్లపాలు చేస్తోంది. వెనక్కి పంపుతోంది. చాలా యూరప్ దేశాలు ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఇక అంతంత మాత్రం ఆర్థిక వ్యవస్థలతో సతమతమయ్యే దేశాల్లో శరణార్థులను, వలసదారులను ఆదరిస్తారని ఆశించటం దురాశే.
ఎవరెంత వ్యతిరేకిస్తున్నా, ద్వేషిస్తున్నా వలసలు మున్ముందు మరింత పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ఎందుకంటే వారు తమ ఇష్టానుసారం రావటం లేదు. తప్పనిసరై, గత్యంతరం లేక స్వస్థలాలను వదల వలసి వస్తోంది. వలసలను వ్యతిరేకించటం కాక, వాటిని అనుకూలంగా మలుచుకోవటం ఎలాగో నేర్చుకోవటం అన్ని దేశాలకూ తప్పనిసరి.