సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో బుధవారం 3,600 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 4.5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ ప్రదర్శనను చూసి ప్రతి ఒక్కరి మది మురిసింది. వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. జేఎన్ రోడ్డులోని మన్యం గార్డెన్స్ నుంచి ఆనాల వెంకట అప్పారావు రోడ్డు, హ్యాపీ స్ట్రీట్ మీదుగా తిరిగి మన్యం గార్డెన్స్ వరకు సాగింది. ఈ పతాకం వరల్డ్ రికార్డు సాధించగా, ర్యాలీలో వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా వెంకట సూర్య ప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధులు బోడా వీర్రాజు ఎరుకుల్ల రామకృష్ణ పాల్గొన్నారు.
పారదర్శకంగా పన్నుల వసూలు
రాజమహేంద్రవరం రూరల్: స్వర్ణ పంచాయతీల్లో పన్నుల వసూలు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. కోలమూరు గ్రామ పంచాయతీలో స్వర్ణ పంచాయతీ యాప్ పనితీరు, సంస్కరణలపై ఆయన, పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.కృష్ణతేజ బుధవారం డిప్యూటీ ఎంపీడీవో బొడ్డు అమ్మిరాజు వరప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు.
మునికూడలి ఘాట్ పరిశీలన
సీతానగరం: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సూచించారు. ఆయన బుధవారం పంచాయతీ రాజ్ కమీషనర్ మైలవరపు కృష్ణతేజ, కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్తో కలిసి మునికూడలి గ్రామంలో ప్రతిపాదిత మోడల్ పుష్కర్ ఘాట్ను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.


