రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 1వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మేళాకు ఐటీ, నాన్ ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటల్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఈ–కామర్స్, రిటైల్, ప్రొడక్షన్, టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాలకు చెందిన 70 కంపెనీలు హాజరై, సుమారు రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాయన్నారు. ఆసక్తి కలవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అలాగే జాబ్ మేళా హెల్ప్ డెస్క్ వద్ద కూడా రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగనన్న స్ఫూర్తితో తాను యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నానని, ఆయన లక్షా 20 వేల ఉద్యోగాలు కల్పించారని, తాను కనీసం 10 వేల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మార్గాని సురేష్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే చిన్ని, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, వివిధ విభాగాల అధ్యక్షులు వట్టికుటి కృష్ణవేణి, బిల్డర్ చిన్నా, పీత రామకృష్ణ, మజ్జి అప్పారావు, దాది గౌరీ శంకర్, మార్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.


