దేవరపల్లి: గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి మంగళవారం రాత్రి అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుని పారిపోయింది. కరిచర్లగూడెం శివారులోని మెట్టపై రిజర్వుడు ఫారెస్ట్లో పెద్దపులి ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు డ్రోన్, ట్రాకర్ ద్వారా గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమాన్ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. పులి దాగి ఉన్న కొబ్బరి, కోకో తోటను అధికారులు చుట్టుముట్టారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో గన్ మిస్ఫైర్ కావడంతో పులి అక్కడ నుంచి తప్పించుకుని, కరగపాడు, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల వైపు పారిపోయింది. మార్గం మధ్యలో గేదె దూడపై దాడి చేసి హతమార్చింది. వచ్చిన దారిలోనే పులి తిరిగి పోలవరం మండలం ఎల్ఎన్డీ పేట ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.


