కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం మొండి వైఖరి కారణంగా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే. ఆఖరి దశ చర్చల్లో పర్మినెంట్ కార్మికులు 11 మంది, కాంట్రాక్టు కార్మికులు 59 మంది మినహా మిగిలిన వారందరూ విధులకు హాజరు కావచ్చంటూ యాజమాన్యం తరఫున కొద్ది రోజులుగా అనధికారిక రాయబారాలు కొనసాగిస్తున్నారు. అయితే, రాజమహేంద్రవరంలో గురువారం 11 మంది పర్మినెంట్ కార్మికులపై విచారణ జరిగింది. ఈలోపునే మిల్లులోని డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి లాకౌట్ ఎత్తివేసినట్లు పర్మినెంట్ కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. శుక్రవారం నుంచి విధులకు రావాలని చెబుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా నిష్కారణంగా లాకౌట్ ప్రకటించి, ఇప్పుడు ఎత్తివేస్తున్నట్లు కూడా చెబుతూండటంపై కార్మిక వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలూ లేకపోవడాన్ని కార్మికులు విమర్శిస్తున్నారు. యాజమాన్యం తీరు ఎప్పుడూ ఇలా ఏకపక్షంగానే ఉంటోందని, ప్రభుత్వ యంత్రాంగం దీనిపై సమగ్రంగా దృష్టి పెట్టి, తమ హక్కులు కాపాడాలని వారు కోరుతున్నారు. అయితే, 11 మంది పర్మినెంట్, 59 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా అనుమతిస్తేనే విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించినట్లు సమాచారం. యాజమాన్యం పిలుపునకు కార్మికులు ఎంతవరకూ స్పందిస్తారో వేచి చూడాలి.


