● కూలిన శ్లాబు ● గోనె సంచులకు మంటలు
సీతానగరం: పురుషోత్తపట్నంలోని రైతు సేవా కేంద్రం(ఆర్ఎస్ఎకే)పై పిడుగు పడి మంటలు చెలరేగడం గ్రామంలో కలకలం రేపింది. గురువారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఆర్ఎస్కే భవనంపై ఒక్కసారిగా పిడుగు పడింది. దాని తాకిడికి శ్లాబ్ ధ్వంసమై, లోపల ఉన్న గోనె సంచులకు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు. సమాచారం అందడంతో రాజమహేంద్రవరం నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి ఫైరింజన్తో మంటలను అదుపు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది శుక్రవారం అంచనా వేస్తామని మండల వ్యవసాయ అధికారి గౌరీదేవి చెప్పారు.


