● కోనసీమ జిల్లాకు చెందిన క్లీనర్ మృతి
● మరో 14 మందికి గాయాలు
ఉయ్యూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉయ్యూరు జియో పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం సంత చెరువు మార్కెట్ చెందిన బస్సు క్లీనర్ ఎరబాల సూర్యచంద్రశేఖర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రమణ ట్రావెల్స్కు చెందిన బస్సు యానాం నుంచి 33 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరింది. ఉయ్యూరు జియో పెట్రోలు బంకు సమీపంలోకి రాగానే చేపల లోడుతో ఆగి ఉన్న లారీని అర్ధరాత్రి దాటాక వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునజ్జయింది. బస్సు క్లీనరు ఎరబాల సూర్యచంద్రశేఖర్ మృతి చెందాడు. డ్రైవరుతో పాటుగా బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయాలపాలైన ప్రయాణికులను అంబులెన్సుల్లో వైద్యం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. తొమ్మిది మంది ప్రయాణికులు విజయవాడలో, ఐదుగురు ప్రయాణికులు ఉయ్యూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సూర్యచంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభు త్వాస్పత్రికి తరలించారు. సీఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


