కరప: కుమార్తెను, అల్లుడిని చూడటానికి మనవడితో కలసి మోటార్ సైకిల్పై వెళ్తున్న ఆ తండ్రిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. మరో 5 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా కారు ఢీకొని ఆయన అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలం పెనుగుదురు పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామానికి చెందిన గుత్తుల రామకృష్ణ (60) తన మనవడు విజయ్తో కలసి టీవీఎస్ మోటార్సైకిల్పై కాకినాడ రూరల్ మండలం తూరంగిలో నివసిస్తున్న తన అల్లుడు వాసంశెట్టి శ్రీనివాసరావు, కుమార్తెను చూడటానికి బయలుదేరారు. పెనుగుదురు పెట్రోల్ బంక్ సమీపంలోని మలుపు వద్దకు వచ్చే సరికి కాకినాడ వైపు నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో తాత, మనవళ్లు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. రామకృష్ణ పైనుంచి కారు చక్రం వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని అల్లుడు శ్రీనివాసరావు వచ్చి గాయాలతో ఉన్న విజయ్ని చికిత్సకోసం 108లో కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరప ఎస్ఐ టి.సునీత ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


