సాక్షి, రాజమహేంద్రవరం: రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, ఈ అంశాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. 2029లో దేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారని జోస్యం పలికారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా మారిందని, కాపుల స్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని అభిప్రాయపడ్డారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన సీఎం చంద్రబాబు బిలియనీర్ ఎలా అయ్యారు, ప్రజల సొమ్ము దోచుకోలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన దారుణంగా ఉందన్నారు. అప్పులు చేసి రాజధానికి పెడుతున్నారు. అది అమరావతి కాదు.. కమ్మరావతి అని అక్కడి ప్రజలే చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎకరం రూ.99తో 100 ఎకరాలు లీజుకు ఇస్తున్నారు. దేవతలు తిరిగిన ప్రాంతం కావడంతో రాజధానికి ఎంపిక చేశామని అంటున్నారు. నేను చాలాసార్లు అక్కడ తిరిగా ఏ దేవతా కనిపించలేదే? అని అన్నారు. అమరావతి షిఫ్ట్ కావడం తథ్యం. ఎక్కడికి పోతుందో ఇప్పుడే చెప్పలేనన్నారు. 1953 నుంచి రాజధాని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతూనే ఉందన్నారు. చంద్రబాబు కలలు సఫలీకృతం కావన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేదలకు చేసింది శూన్యమని, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారన్నారు. జడ్జీల నియామకాలు, జడ్జిమెంట్లలో రాజకీయ జోక్యం తగదన్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో ఒక జడ్జి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే, ప్రభుత్వ పెద్దలు అనుమతి కావాలని ఆరోపించారు. ఇరాన్–అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు మిగిలాయన్నారు. రాజమహేంద్రవరంలో గ్యాస్ లేక హోటళ్లు మూతపడ్డాయి. కృష్ణా, గోదావరి బేసిన్ గ్యాస్ స్థానికులకు అందడం లేదు. సమావేశంలో ఎస్సీ నేత జెడ్డా మోహన్ పాల్గొన్నారు.


