సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ముస్లింలకు ఎంతో పవిత్రమైన హజ్ యాత్ర ఏర్పాట్లపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబదుల్లా ఖురేషి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హజ్ యాత్రకు సంబంధించిన మొదటి విమానం ఏప్రిల్ 18న గన్నవరం ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ యాత్రికులకు సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు ఆరు నెలల ముందుగానే గుంటూరులోని నంబూరు మదరసాలో యాత్రికులకు అన్ని విధాలా వసతులు కల్పించి, మక్కా యాత్రకు పంపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజు వరకు హజ్ యాత్రకు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్నారు. హజ్ కమిటీలో నిబంధనలకు విరుద్ధంగా మత గురువుల స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించడంపై జిల్లాకు చెందిన షేక్ నిజాం హైకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయం ముస్లిం సమాజానికి తెలిసిందేనన్నారు.


