ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి భీమవరం వాస్తవ్యులు 108 గ్రాముల సుమారు రూ.17 లక్షల విలువైన స్వర్ణ శఠగోపాన్ని సమర్పించారు. వుద్ధరాజు సత్యవతమ్మ పేరున వారి కుమారులు రాఘవరాజు, సూర్యనారాయణ రాజులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అలాగే ఆలయంలో కొత్తగా నిర్మించిన ఉచిత క్యూలైన్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ధర్మకర్తలి సభ్యుడు తమ్మన సాయిప్రసాద్ పాల్గొన్నారు.
కల్యాణోత్సవాలకు శ్రీకారం
వాడపల్లి వేంటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.


