కొలిక్కిరాని గ్రౌండ్ వివాదం
● కడియపులంకలో
భారీగా పోలీసుల మోహరింపు
● రిలే దీక్షా శిబిరం టెంటు మార్పు
● మొదలైన ఏపీ టూరిజం ప్రాజెక్టు పనులు
కడియం: కడియపులంక గ్రామంలోని సుమారు మూడు ఎకరాల క్రీడా ప్రాంగణం వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్లో నిర్మించనున్న ప్రాజెక్టును స్థానిక యువత వ్యతిరేకిస్తూ దాదాపు 50 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం విదితమే. అయితే మంగళవారం రిలే దీక్షా శిబిరం వద్దకు భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. పోలీసుల రాక నేపథ్యంలో యువకులు కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న యువతను సచివాలయం వద్దకు చర్చలకు పిలిచారు. ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, వైస్ ఎంపీపీ పంతం గణపతి, స్థానిక నాయకులు గట్టి సుబ్బారావు, మార్గాని ఏడుకొండలు, తహసీల్దార్ సునీల్కుమార్, ఏపీటూరిజం అధికారులు యువకులతో చర్చలు జరిపారు. సుమారు 70 సెంట్ల స్థలాన్ని క్రీడా ప్రాంగణంగా విడిచిపెట్టేందుకు మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి దృష్టికి శనివారం తీసుకువెళతామన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల ఆదేశాల మేరకు దీక్షా శిబిరాన్ని తొలగించాలని కోరారు. అయితే యువకులు తమకు కచ్చితమైన హామీ లభిస్తే తప్ప దీక్షా శిబిరాన్ని తొలగించేది లేదని తేల్చి చెప్పారు. పోలీస్ బలగాలతో తమ ఆందోళనను అణగదొక్కాలని చూడడం సబబు కాదని అన్నారు. అప్పటికే దీక్షా శిబిరం టెంట్ను పోలీసులు తొలగించారు. తమకు కచ్చితమైన హామీ వచ్చేంత వరకు దీక్షా శిబిరాన్ని అక్కడే ఉంచాలని యువకులు పట్టుబట్టారు.నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశం నుంచి టెంట్ను తొలగించి, పక్కనే వేసుకోవాల్సిందిగా ఇన్చార్జి డీఎస్పీ వై. శ్రీకాంత్ సూచించారు. అనంతరం టెంట్ను అదే గ్రౌండ్లో పక్కకు జరిపి వేశారు. కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ.వేంకటేశ్వరరావు, ధవళేశ్వరం, రూరల్ మండలంలోని పలు పోలీస స్టేషన్ల సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ప్రజాప్రతినిధులు ఇచ్చే హామీని అనుసరించి తమ తదుపరి పోరాటం ఉంటుందని యువకులు తేల్చి చెప్పారు. ఒకపక్క వివాదం నడుస్తుండగానే ఏపీ టూరిజం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఫుటింగ్స్ వేసేందుకు గోతులు తీసే పనులను చేపట్టారు.
యువకులతో చర్చిస్తున్న నాయకులు, అధికారులు
టెంటు మార్పుపై యువకులు, అధికారుల మధ్య వాగ్వాదం
కొలిక్కిరాని గ్రౌండ్ వివాదం


