టెన్త్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
రాజమహేంద్రవరం సిటీ: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయశాఖలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ప్రశ్నాపత్రాల రవాణా, భద్రపరిచే విధానంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని ఆదేశించారు. వైద్యశాఖ ద్వారా అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లావ్యా ప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 24,538 మంది విద్యార్థులు నమోదు కాగా, బాలురు 12,555 మంది, బాలికలు 11,983 మంది అని వివరించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె. వాసు దేవరావు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
మార్చి 16 నుంచి
ఏప్రిల్ 1 వరకు నిర్వహణ
హాజరు కానున్న
24,538 మంది విద్యార్థులు
జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి


