భారత మిర్చికి విశేష అవకాశాలు
● నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి
● మిర్చి ఎఫ్పీవో పాలనపై
మూడు రోజుల శిక్షణ ప్రారంభం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): శాసీ్త్రయ ఉత్పత్తి విధానాలు, కోతానంతర నిర్వహణ, ఎగుమతి దృష్టితో నాణ్యత ప్రమాణాలు భారత మిర్చికి దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం మార్కెట్లలో విశేష అవకాశాలు కల్పిస్తాయని జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలోని ఐకార్–నిర్కాలో మిర్చి ఆధారిత రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీవో)ల బలోపేతానికి ‘మిర్చి ఎఫ్పీవో పాలన, కోతనాంతర నిర్వహణ, ఎగుమతి మార్కెట్ అనుసంధనాలు అనే అంశంపై మూడు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)ఫౌండేషన్తో కలిసి, ఒర్కా ఇండియా లిమిటెడ్ సహకారంతో నిర్వహించారు. ప్రారంభ సమావేశంలో ఈ శిక్షణకు సంబంధించిన సాంకేతిక బులిటెన్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి.కరుణ శ్రీ మాట్లాడుతూ బలమైన ఎఫ్పీవో పాలన, సర్టిఫికేషన్ మార్గాలు, సమిష్టి మార్కెటింగ్ వ్యూహాల ద్వారా రైతుల ఆదాయం పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. సీఐఐ ఫౌండేషన్ ఎఫ్పీవో ప్రోగ్రామ్ మేనేజర్ విక్రమ్ ఎం.నింబాల్, ఒర్కా సీనియర్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్) ఆర్.సెల్వరాజ్ సంస్థాగత అనుసంధానాలు, సర్టిఫికేషన్, నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యాన్ని వివరించి ఎఫ్పీవోలకు మెరుగైన మార్కెట్ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మిర్చి ఎఫ్పీవో నాయకుల నిర్వహణ, సాంకేతిక, మార్కెట్ ఆధారిత సామర్థ్యాలు మెరుగుపడి, నాణ్యత పెంపు, విలువ జోడింపు తదితర అంశాలకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు చెందిన మిర్చి ఆధారిత రైతు ఉత్పత్తిదారుల సంస్థల సీఈఓలు మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు.


