అమలాపురం టౌన్: మండలంలోని పేరూరు గ్రామ శివారు దూడలవారి వీధికి చెందిన చవ్వాకుల హారతి (24), ఆమె కుమార్తె నందన (6), కుమారుడు భార్గవ్ (4) అదృశ్యమయ్యారు. వీరు శనివారం సాయంత్రం 3.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. హారతి భర్త నగేష్ తన భార్య, పిల్లల ఆచూకీ కోసం ఆమె పుట్టింటి వారిని, స్నేహితులు, బంధువులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో శనివారం రాత్రి అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భర్త నరేష్ కొబ్బరి ఒలుపు కార్మికుడిగా పని చేస్తున్నాడని, భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నాయని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. సీఐ కథనం ప్రకారం... హారతి ఇంటి నుంచి తన ఎలక్ట్రికల్ స్కూటీపై పిల్లలను ఎక్కించుకుని తన పుట్టినిల్లు మామిడికుదురు మండలం లూటుకుర్రు వెళ్లింది. హారతి కొద్ది సేపటికే తన పిల్లలతో తిరిగి అమలాపురం బయలుదేరింది. అమలాపురం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి అక్కడి సైకిల్ స్టాండ్లో తన స్కూటీని పెట్టి పిల్లలతో సహా వెళ్లిపోయింది. పట్టణ పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో హారతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైకిల్ స్టాండ్లో తన స్కూటీని పెట్టినట్లు గుర్తించారు. తర్వాత ఆమె తన పిల్లలతో బస్సు ఎక్కి ఏదో ఊరు వెళ్లినట్లు గమనించారు. భర్త నరేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆమెతోపాటు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టనట్లు సీఐ వీరబాబు తెలిపారు. ఆ తల్లీ బిడ్డల ఆచూకీ తెలిసిన వారు పట్టణ సీఐ 94407 96561, ఎస్సై 79811 66996 ఫోన్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.