
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు
● బాలికను మోసగించి ముఖం చాటేసిన వైనం
● అబార్షన్ చేయించిన నిందితుడు
● కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు నమోదు అయింది. అతను బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఏడు నెలల గర్భవతిగా ఉన్న ఆమెకు అబార్షన్ చేయించిన అతనిపై బాధితురాలు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేశారని బాధితురాలు ఆరోపించారు. రాజమహేంద్రవరం మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ 2022 నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసగించాడు. 2024 నవంబర్ నెలలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ బాలిక 6వ నెల గర్భవతి అని నిర్ధారించారు. ఈ మేరకు పులపర్తి సత్యదేవ్ వద్దకు వెళ్లి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు అడిగారు. అయితే నేను ఇప్పుడు అయ్యప్పస్వామి మాలలో ఉన్నాను. మాల తీసే లోపు మీ అమ్మాయికి అబార్షన్ చేయించమని కోరాడు. దీంతో 2024 డిసెంబర్ 17న బాలికకు ధవళేశ్వరంలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. అనంతరం పెళ్లి చేసుకోమని అడుగగా అప్పటి నుంచి సత్యదేవ్ ఆచూకీ తెలియలేదని, ఈ మేరకు న్యాయం చేయాలని బొమ్మూరు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపారు.
బాధితురాలికి న్యాయం చేయండి
గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన నిందితుడు పులవర్తి సత్యదేవ్పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి తదితరులు తూర్పుజోన్ డీఎస్పీ విద్య, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ను కోరారు. బాధితురాలితో కలిసి పోలీసు అధికారులను కలిసి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర తెలికులగాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిన భవానిప్రియ, మహిళా నేతలు పాల్గొన్నారు.
మానవతా దృక్పథంతోనే కేసు నమోదు ఆలస్యం : డీఎస్పీ విద్య
మానవతా దృక్పథంతోనే బాధితురాలు కోరిక మేరకు కేసు నమోదు ఆలస్యమైందని తూర్పుజోన్ డీఎస్పీ బి.విద్య అన్నారు. శుక్రవారం బొమ్మూరు పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 4వ తేదీన బాధితురాలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిందన్నారు. జిల్లా వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారన్నారు. ఆ సమయంలో ఆమెకు తాను, సౌజన్య కౌన్సెలింగ్ ఇచ్చామని, సత్యదేవ్తో తనకు వివాహం జరిపించాలని కోరిందన్నారు. దీంతో సత్యదేవ్ను, అతని బాబాయిని పిలిచి మాట్లాడామన్నారు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని, పదిరోజులు సమయం కావాలని కోరారన్నారు. పదిరోజులు కుదరదు ఏడురోజులలో విషయం తెలపాలని ఇద్దరికీ చెప్పామన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్పై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. అబార్షన్ చేసిన ఆసుపత్రిపై చర్యలు ఉంటాయన్నారు. సత్యదేవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. బొమ్మూరు పీఎస్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథం, వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య పాల్గొన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు