పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక సమీపాన ఏటిగట్టు దిగువన తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న సంచార జాతుల ఇళ్లు నీట మునిగాయి. వరద నీరు ఒక్కసారిగా వారి తాత్కాలిక గుడిసెల్లోకి చేరడంతో ఇళ్లలోని సామగ్రి, బట్టలు తడిసిపోయాయి. ఆ గుడిసెల్లో నివాసం ఉండేందుకు వీలు లేకపోవడంతో వారు ఏటిగట్టుపై తాత్కాలికంగా గుడారాలు వేసుకుని కాలం గడుపుతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదలో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గోదావరి లంకల్లోని పశువులు, గొర్రెలు, మేకలు వరదలో కొట్టుకుపోకుండా రైతులు ఏటిగట్ల మీదకు తరలించారు. వరదలకు ఎండు, పచ్చగడ్డి కొట్టుకుపోవడంతో వాటికి మేత కొరత పీడిస్తోంది. ప్రభుత్వం నుంచి దాణా అందడం లేదని రైతులు వాపోతున్నారు.


