అయినవిల్లి: వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. ముక్తేశ్వరం – అయినవిలంక మధ్య ఎదురుబిడెం కాజ్వే వద్ద వరద పరిస్థితిని ఆయన ఆదివారం పరిశీలించారు. నాయకులతో కలసి నాటు పడవపై లంక గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజలకు భరోసా కల్పించారు. వరద ప్రభావిత గ్రామాల్లో పార్టీ తరఫున తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసబాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష నారాయణ స్వామి, గుత్తుల నాగబాబు, దాసరి వీరాస్వామి, కోనే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


