కదం తొక్కిన సహకార ఉద్యోగులు
అమలాపురం టౌన్: అమలాపురం డీసీసీబీ బ్రాంచి కార్యాలయం వద్ద జిల్లాలోని 18 బ్రాంచ్ల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు కదం తొక్కారు. జిల్లాలోని మిగిలిన 7 డీసీసీబీ బ్రాంచ్ల పరిధిలోని ఉద్యోగులు రామచంద్రపురం డీసీసీబీ బ్రాంచ్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలోని 166 సహకార సంఘాలకు చెందిన ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ (జేఏసీ) పిలుపు మేరకు విధులు బహిష్కరించి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అమలాపురంలో 18 డీసీసీసీ బ్రాంచీల పరిధిలోని సంఘాలకు చెందిన దాదాపు 250 మంది ఉద్యోగులు ధర్నా చేశారు. ‘వెట్టి చాకిరికి హద్దు లేదు – ప్రభుత్వానికి బుద్ధి లేదు’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్ల కార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. వీరి ధర్నా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ ఐవీ వెంకటేశ్వరరావు (ఐవీ) సందర్శించి ప్రసంగించారు. సహకార ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం, నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఐవీ ఆరోపించారు. జీఓ 36ను అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, హెచ్ఆర్సీ పాలసీని, గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయాలని సహకార ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ సమ్మె వీడేది లేదని జిల్లా సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అమలాపురం రూరల్ మండలం రోళ్లపాలెం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మట్టా మహాలక్ష్మీ ప్రభాకర్ ధర్నా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావుతోపాటు సహకార ఉద్యోగుల సంఘం నాయకులు కుంపట్ల అయ్యప్పనాయుడు, కట్టా లక్ష్మీకళ, తోరం దోరాజీ, సీహెచ్ లింగయ్యనాయుడు, టి.సోమన్న, పి.నాగేశ్వరరావు, పి.ప్రసాద్, కె.శ్రీనివాసరాజు, ఆకుల సూరిబాబు, వై.శివ, డి.రాఘవేంద్రనాయుడు ధర్నాకు నాయకత్వం వహించారు.


