ప్రమాద స్తలాన్ని పరిశీలిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి తదితరులు
అయోమయంలో అధికారులు
పనికి వెళ్లిన కూలీలెందరో?
మృతుల గుర్తింపులో జాప్యం
రాయవరం: గ్రామంలో చోటు చేసుకున్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు దుర్ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. బాణసంచా ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. మరణాలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో స్కిల్డ్ లేబర్ మాత్రమే పనిచేయాలన్నారు. ఎంతమంది నిపుణులైన కార్మికులు పనిచేస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదన్నారు. సరైన పర్యవేక్షణ చేస్తున్నారా? లేదా? అనేది ప్రభుత్వం చూడాలన్నారు. పీరియాడికల్ తనిఖీలు చేపడుతున్నారా? లేదా? అన్నది కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారా? లేదా? అన్నది కూడా చూడాలన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది పనిచేస్తున్నారో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారన్నారు. జగ్గిరెడ్డి వెంట మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గా భవాని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాసరావు, పార్టీ నేతలు వెలగల సత్యనారాయణరెడ్డి, కుడుపూడి రాంబాబు, తమలంపూడి గంగాధరరెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్సీ తోట దిగ్భ్రాంతి
కపిలేశ్వరపురం (మండపేట): కొమరిపాలెంలో బుధవారం సంభవించిన బాణసంచా పేలుడు ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులో ఉన్న ఆయన ఈ మేరకు వీడియో సందేశాన్ని పంపి మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను కోరారు. కార్మికులకు బీమా సదుపాయం కల్పించిన తరువాతే బాణసంచా తయారీ సంస్థలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


