Guntur: యువకుడి కీచకపర్వం.. ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు.. హద్దుమీరడంతో

Young Woman commits Suicide Due to Man Harassment For Love In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: : లైంగిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శావల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లేళ్ల లోకేశ్వరరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. శానంపూడి గ్రామానికి చెందిన పులుకూరి శ్రావణి (19) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసి ఇంటిలో తన తల్లికి సహాయంగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన చెన్నంశెట్టి నాగేంద్రబాబు తరచూ ప్రేమ పేరుతో శ్రావణిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి వెంకటాచారి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం యంపరాల గ్రామంలోని తన బావమరిది ఇంటికి ఆమెను పంపించాడు.

అయినప్పటికీ నాగేంద్రబాబు తన స్నేహితులతో కలిసి ఈ నెల 2వ తేదీన యంపరాల గ్రామం వెళ్లి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రావణి అత్తయ్య విషయాన్ని వెంకటాచారికి చెప్పడంతో.. యువతిని స్వగ్రామం తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో వెంకటాచారిపై నాగేంద్రబాబు దాడి చేయడమే కాక.. హద్దుమీరి కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని హెచ్చరించాడు. మనస్తాపానికి గురైన యువతి.. మరుసటి రోజు ఉదయం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.కుటుంబ సభ్యులు వినుకొండ పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ నాలుగురోజుల చికిత్స అనంతరం సోమవారం రాత్రి అత్యవసరంగా నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.  మృతురాలి తండ్రి  ఫిర్యాదు మేరకు నాగేద్రబాబు, పత్తి శ్రీనివాసరావు, అనిల్‌పై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితులను చట్టపరంగా శిక్షించాలని సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రాము కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top