మా ప్రీతిని కచ్చితంగా పవనే హత్య చేశాడు

young Girl Lost Life In Suspicious In Kethepalle Mandal Nalgonda - Sakshi

మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు ఆనవాళ్లు

ప్రేమికుడిపైనే కుటుంబ సభ్యుల అనుమానం

పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

కేతేపల్లి మండలం కొప్పోలులో ఘటన

కేతేపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని కొప్పోలులో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన చింతమళ్ల దశరథ అలియాస్‌ శ్రీను, నాగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి(17) నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటోంది. మూడు రోజుల క్రితం ప్రీతి స్వగ్రామానికి వచ్చింది. సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి తర్వాత శ్రీను లేచి చూసే సరికి ప్రీతి కనిపించలేదు. ఇంట్లో ఉన్న ఇతర గదులతో పాటు బాత్‌రూంలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామంలో రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది.

వ్యవసాయ భూమిలో విగతజీవిగా...
మంగళవారం ఉదయం కొప్పోలు శివారులోని రైస్‌మిల్లు వెనుక ఉన్న రైతు నంద్యాల వాసుదేవరెడ్డి వ్యవసాయ భూమిలో ప్రీతి విగతజీవిగా పడి ఉంది. ప్రీతి మెడ చుట్టూ చున్నీ బిగించి లాగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. నోట్లోనుంచి నురగలు వస్తున్నాయి. మృతదేహం వద్ద పగిలిన బీరుసీసా గాజు పెంకులు పడి ఉన్నాయి. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడి వెళ్లి చూడగా ప్రీతి మృతిచెంది ఉంది. ప్రీతి తమ్ముడు అనారోగ్యంతో ఏడాది కిత్రం మృతిచెందాడు. ఏడాది కాల వ్యవధిలోనే  తమకున్న ఇద్దరు సంతానం మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. 


వ్యవసాయ భూమిలో ప్రీతి మృతదేహం 

ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
సమాచారం అందుకున్న కేతేపల్లి ఎస్‌ఐ బి.రామక్రిష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం రాత్రి ప్రీతి ఫోన్‌లో ఎవరెవరితో  మాట్లాడింది? ప్రీతిది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

హత్య చేశారని ఆరోపణలు
కొంత కాలంగా ప్రీతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న గ్రామానికి చెందిన దోరెపల్లి పవన్‌ తన కూతురును హత్య చేశాడని ఆమె తల్లి నాగమ్మ, బంధువులు ఆరోపిస్తున్నారు.  విష యం తెలిసి తాము పవన్‌ను మందలించడంతో ప్రీతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తమను కూడా నమ్మించాడని తెలిపారు. ప్రేమిస్తున్న తనతో కాకుండా నల్లగొండలో ఇతరులతో  తిరుగుతున్నాంటూ పవన్‌ ప్రీతిపై అనుమానం పెంచుకున్నాడని, ఈ క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చి కూతురుపై చేయి చేసుకున్నాడని, చంపుతానంటూ బెదిరించాడని వాపోయారు. రాత్రి తమతో ఇంట్లో పడుకున్న ప్రీతికి ఫోన్‌లో మాయమాటలు చెప్పి, బయటికి రప్పించి హత్య చేశాడని ఆరోపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top