Thiruvallur District Court Sensational Judgement On Molestation Case - Sakshi
Sakshi News home page

13 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం... 31 ఏళ్ల జైలు శిక్ష

Jun 11 2023 7:35 AM | Updated on Jun 11 2023 11:13 AM

sensational judgement On molestation case - Sakshi

ప్రైవేటు లాడ్జీలో ఉంచి 10 రోజుల పాటు అత్యాచారం చేశాడు.

తిరువళ్లూరు: పదమూడేళ్ల బాలికను కిడ్నాప్‌చేసి ఆపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 31 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోని కాంచీపాడి గ్రామానికి చెందిన ఢిల్లీబాబు(30)పై వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు, కిడ్నాప్, స్నాచింగ్‌ కేసులు ఉన్నాయి.

ఇతను తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను 2019లో కిడ్నాప్‌ చేశాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు ఢిల్లీబాబు బాలికను కిడ్నాప్‌ చేసి  పూందమల్లిలోని ప్రైవేటు లాడ్జీలో ఉంచి 10 రోజుల పాటు అత్యాచారం చేశాడు.

ఈ ఘటన అప్పట్లో కలకలం రేపగా తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణ తిరువళ్లూరు జిల్లా కోర్టులో సాగింది. విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తి సుభద్రదేవి తుది తీర్పు వెలువరించారు. బాలికను కిడ్నాప్‌ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష, అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, బాలికను నిర్బంధించినందుకు మరో ఏడాది జైలుశిక్ష విధించారు. కాగా తీర్పు అనంతరం నిందితుడిని పోలీసులు పుళల్‌ జైలుకు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement