రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత  | Rs 8 lakh worth Ganja seized | Sakshi
Sakshi News home page

రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత 

Mar 4 2024 4:04 AM | Updated on Mar 4 2024 4:04 AM

Rs 8 lakh worth Ganja seized - Sakshi

సినీ ఫక్కీలో కంటైనర్‌ను వెంటాడి పట్టుకున్న విశాఖ పోలీసులు   

స్పేర్‌ పార్టుల ముసుగులో రవాణా

ఆనందపురం (విశాఖ జిల్లా):  కంటెయినర్‌లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్‌ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్‌ పార్టుల లోడుతో  హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్‌లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్‌ పోస్టు వద్ద కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని,  డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్‌ పోస్టులకు సమాచారమిచ్చారు.

ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద కంటెయినర్‌ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్‌ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్‌ బైక్‌ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్‌ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్‌లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్‌ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు.

అందులో స్పేర్‌ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్‌ను ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ–1 విజయ్‌ మణికంఠ, ఏసీపీ(నార్త్‌) సునీల్‌లు కంటెయినర్‌ను పరిశీలించి 13 బ్యాగ్‌లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజా­యి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్‌
మణికంఠ చెప్పారు.   

Advertisement
 
Advertisement
Advertisement