ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?

Rhea Chakraborty arrives at the ED office to record her statement - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించి రియా  చక్రవర్తి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైనారు.  తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ఆమె ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.  (రియాకు ఈడీ సమన్లు జారీ.. స్పందన లేదు)

ముఖ్యంగా కోట్లాది రూపాయల ఆస్తులను కలిగి ఉన్న రియా ఆదాయ వనరులను ఆరాతోపాటు, సుశాంత్ తో ఉన్న ఆర్థిక లావాలేవీలపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతోపాటు రియా సోదరుడు బిజినెస్ గురించి అధికారులు విచారించే అవకాశం ఉందని అంచనా. అలాగే గత అయిదేళ్లుగా ఆదాయ పన్ను రిటర్నుల వివరాలను సమర్పించాలని  ఆదేశించనున్నారు. ఈ విచారణకు సహకరించని పక్షంలో రియాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ముంబై కార్యాలయంలో తన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలతో పాటు తన ముందు హాజరు కావాలని రియాను కోరింది.  కాగా రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్ దాఖలు చేసిన కేసును పట్నా నుంచి ముంబైకి  కేసును బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు తన స్టేట్‌మెంట్ రికార్డింగ్‌ను వాయిదా వేయాలని చక్రవర్తి కోరగా ఈ అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది.  మరోవైపు సుశాంత్  ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top