పీజీ గోల్డ్‌ మెడలిస్ట్‌.. ప్రేమించి పెళ్ళి చేసుకొంది.. అంతలో ఏమైందోగానీ!

Asha Suspicious Death In Mysore - Sakshi

కట్నం కోసం భర్త వేధింపులు  

పీజీ గోల్డ్‌ మెడలిస్ట్‌ అనుమానాస్పద మృతి 

సాక్షి, మైసూరు: చదువుల్లో మేటి, బంగారు పతకం కూడా సాధించింది, కానీ జీవితంలో ఓడిపోయింది. శనివారం మైసూరు జేపీ నగరంలో ఆశా (30) అనే వివాహిత అనుమానాస్పదరీతిలో శవమైంది. ఆమె స్వస్థలం మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా మడేనహళ్ళి. ఎనిమిదేళ్ల కిందట మళవళ్ళికి చెందిన నాగప్రసాద్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకొంది. మైసూరులోని జేజీ నగరలో కాపురం పెట్టారు. ఆశా గతంలో మైసూరు వర్సిటీలో పీజీ పూర్తిచేసి స్వర్ణ పతకం కూడా సాధించింది.

భర్త నాగప్రసాద్‌ కట్నం తేవాలని భార్యను తరచూ వేధించేవాడు. అతని పోరు తట్టుకోలేక ఆశా రెండుసార్లు పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో  ఇద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు జడ్జి ఇద్దరికీ నచ్చజెప్పడంతో మళ్లీ కలిసి ఉన్నారు. అప్పటికీ భర్త వేధింపులు ఆపకపోవడంతో ఆశ వేరేగా పీజీ హాస్టల్‌లో ఉంటానని స్పష్టంచేసింది. ఇంతలో ఏమైందోగానీ శనివారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకొన్న స్థితిలో ఆమె మరణించింది. విద్యారణ్యపుర పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: (కొత్త కారుకు పూజ కోసం వెళుతూ..)

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top