తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 1,750 సీట్లకు గాను ఇప్పటి వరకు 718 మంది ప్రవేశాలు పొందారు. పద్మావతి మహిళా జూని యర్ కళాశాలలో తొలి విడతలో 252 మంది, రెండో విడతలో 191 మంది అడ్మిషన్లు పొందగా మిగిలిన 525 సీట్లును మూడో విడతలో భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఎస్వీ జూనియర్ కళాశాలలో తొలి విడతలో 172 మంది, రెండో విడతలో 103మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా మూడో విడతలో మరో 517 సీట్లు భర్తీ చేయనున్నారు.
24 నుంచి మూడో విడత కౌన్సెలింగ్
మిగిలి ఉన్న సుమారు 1,032 సీట్లకు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న మూడో విడ త కౌన్సెలింగ్ ప్రక్రియ లో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మెరిట్ లిస్ట్ను 21, 22 తేదీలలో విడుదల చేసి విద్యార్థులకు సమాచారం అందించనున్నారు.
వంద సీట్లకంటే ఎక్కువ భర్తీకాకపోవచ్చు
రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా కనీసం రెండు కళాశాలల్లో 50 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. మూడో విడతలో మరో వంద సీట్లు కంటే ఎక్కువ భర్తీ కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అనంతరం జరిగే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో అడ్మిషన్లు భారీ స్థాయిలో పెరుగుతాయని అంచానా. స్పాట్ ప్రవేశాలలో మెరిట్ను తుంగలో తొక్కి పైరవీలదే హావా కొనసాగనుంది.


