ఈవీఎంల భద్రతపై రాజీపడొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల భద్రతలో ఎలాంటి రాజీ పడొద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన శనివారం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) రక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదన్నారు. అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ యంత్రాల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గోడౌన్ పరిసరాల్లో సీసీ కెమెరాల పనితీరును నిత్యం తనిఖీ చేయాలన్నారు. 24 గంటల నిఘా వ్యవస్థ కొనసాగేలా చర్యలు చేపటాలన్నారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈవీఎంల నిల్వ, భద్రతపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేంద్ర, ఎన్నికల విభాగం సిబ్బంది ఉమాపతి, మనోజ్కుమార్, పార్టీల ప్రతినిధులు ఉదయ్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, గంగరాజు, పరదేశి తదితరులు పాల్గొన్నారు.
చట్టబద్దంగానే
భూముల విక్రయం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని థియోసాఫికల్ సంస్థకు చెందిన భూములను సొసైటీ నిబంధనలకు లోబడి.. చట్టబద్దంగానే విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు ప్రదీప్, సభ్యులు కృష్ణ, షిండే, నారాయణన్, సన త్, త్రివేది శనివారం చిత్తూరులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ ఉచిత విద్య, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తాజాగా ఉచిత వైద్యం అందిచడానికి సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే చిత్తూరులోని భూములను సొసైటీ నిబంధనల మేరకు విక్రయించామన్నారు. కొందరు వ్యక్తులు దీనిపై లేనిపోని అసత్య ప్రచారం చేస్తున్నారని.. దీనిపై చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. ఇక్కడి భూములపై సర్వాధికారాలు సొసైటీకి ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. భూముల విక్రయంపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని తెలిపారు.


