చిత్తూరు కలెక్టరేట్ : ఆహార శుద్ధి రంగం అభివృద్ధికి సమన్వయం అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్గా రెండోసారి ఎన్నికై న కట్టమంచి బాబీని శనివారం కలెక్టర్ సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఆహార శుద్ధి రంగాన్ని బలోపేతం చేసేందుకు పరిశ్రమలు, రైతుల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిష్టాత్మకమైన ఏఐఎఫ్పీఏ సౌత్ జోన్ చైర్మన్గా రెండోసారి ఎంపిక కావడం చిత్తూరు జిల్లాకు గర్వకారణమన్నారు. చిత్తూరు జిల్లాలో పండుతున్న మామిడి, టమాట వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించాలంటే ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య పెరగాలన్నారు. ఇందుకు అసోసియేషన్ చురుకై న పాత్ర పోషించాలని సూచించారు. రైతులు పండించిన పంటను నేరుగా పరిశ్రమలకు విక్రయించేలా ఒక వ్యవస్థను రూపొందించాలని కోరారు. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన అసోసియేషన్ సభ్యులకు, అభినందించిన కలెక్టర్కు కట్టమంచి బాబి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆహార శుద్ధి పరిశ్రమల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జిల్లాలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తలుపులపల్లి బాబురెడ్డి, శివకుమార్, శివారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


