చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్ల హక్కులకు రక్షణ కల్పించాలని ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వారు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆ సంఘం జిల్లా నాయకులు సహదేవనాయుడు, భాస్కర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ సరికాదన్నారు. దాని వల్ల పెన్షనర్లకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు మేరకు ధర్నా చేస్తున్నట్టు వివరించారు. గత ఏడాది మార్చి 25న పార్లమెంటులో ఆమోదించిన ఆర్థిక సవరణ బిల్లులో పెన్షనర్ల విభజన అధికారాన్ని కేంద్రం పొందిందన్నారు. దీనివల్ల ప్రస్తుతం పాత పెన్షన్ పొందుతున్న వారు భవిష్యత్లో పెన్షన్ పెరుగుదల సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నల్ల చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయిందన్నారు. అనంతరం డీఆర్వో మోహన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో రాజారావు, మురళి, సునందరెడ్డి, రంగనాథమ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


