పెనుమూరు(కార్వేటినగరం): కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెనుమూరు మండటలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని అత్తిమాకులపల్లికి చెందిన సుకన్య(32) కు చిత్తూరు రూరల్ మండలం సీఎం కాలనీకి చెందిన నాగేంద్రబాబుతో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 6, 5 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేంద్రబాబు భార్యాపిల్లలతో కలిసి అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నారు. దంపతులు తరచూ గొడవ పడేవారు. మంగళవారం కూడా దంపతుల గొడవ జరిగింది. నాగేంద్రబాబు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని సొంత గ్రామం సీఎం కాలనీకి వెళ్లి పోయాడు. దీంతో మనస్థాపం చెందిన సుకన్య బుధవారం గ్రామంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహం కోసం గాలించారు. మృతదేహం జాడకనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతికి గల కారణాలను ఆరాతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


