వెదురుకుప్పం: పశుగ్రాసం తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తూ దగ్ధమైన ఘటన శుక్రవారం సాయంత్రం వెదురుకుప్పం మండలం దామరకుప్పం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు...శుక్రవారం సాయంత్రం మండలంలోని పచ్చికాపల్లం నుంచి వెదురుకుప్పం వైపు పశుగ్రాసం లోడ్తో వాహనం బయలు దేరింది. మార్గమధ్యలోని దామరకుప్పం వద్ద సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగలు తగిలి నిప్పు రవ్వలు ఎగిసి పడి గడ్డికి అంటుకున్నాయి. దీంతో గడ్డితో పాటు లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. లారీలో మంటలు ఎగిసి పడడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో రోడ్డు పక్కన పొలంలోకి లారీని నడిపి వదిలేశాడు. దీంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పైనే ఉంటే పెను ప్రమాదం సంభవించేది.దీంతో పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేదన్నారు. కాగా రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగలను సరి చేయాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు.


