చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో మార్పులు చేయడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పరీక్షల విధానంలో వినూత్న మార్పులు చేసిన కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం చోటు చేసుకున్నట్లు మండిపడ్డారు. కాగా ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యే పది జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో ట్యాబ్ ఆధారిత విధానం అమలు చేయడం తగదన్నారు. ఈ విధానం అమలుకు రూ.30 లక్షల నిధులు కేటాయించిందన్నారు. ఆ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని విమర్శించారు. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా మార్కుల నమోదులో తప్పిదానికి భారీ జరిమానా నిబంధన పెట్టడం అధికారుల అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ మొరాయించడం, నెట్ కవరేజ్ సరిగా లేకపోవడం తదితర సమస్యలు ఏర్పడినప్పుడు జరిమానా ఎవరికి విధించాలని ప్రశ్నించారు. మార్కుల నమోదుకు రాత్రిళ్లు వేచి ఉండక తప్పదని హెచ్చరించారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం ఆరు సబ్జెకులను రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మూల్యాంకన కేంద్రాల్లో మొదట అమలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.


