గంగాధరనెల్లూరు : మండలంలోని తూగుండ్రం పంచాయతీ దళితవాడకు చెందిన కళ్యాణి, అన్నాదొరైకి చెందిన 150 మామిడి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు సమీపంలోని గుట్టకు నిప్పు పెట్టడంతో గుట్టతో పాటు పక్కన ఉన్న పొలంలోకి మంటలు వ్యాపించాయి. చేతికి వచ్చే దశలో మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
టీటీడీకి కూరగాయల వితరణ
పలమనేరు: తిరుమలలోని అన్నదాన కేంద్రానికి పట్టణంలోని మార్కెట్ నుంచి 12 టన్నుల కూరగాయలను రాష్ట్ర సంచార జాతుల సంఘ అధ్యక్షుడు పూసల రవి ఆధ్వర్యంలో సోమవా రం అందజేశారు. టీటీడీ వాహనానికి దాతలు పూజలు చేసి గోవిందనామ స్మరణ మధ్య తిరుమలకు సాగనంపారు. ఇందులో మండీ యజమానులు రెడ్డెప్పరెడ్డి, కందస్వామి తదితర శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
166 మంది గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షకు 166 మంది గైర్జాజరైనట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 734 మంది విద్యార్థులకు గాను 568 మంది హాజరైనట్టు ఆయన వెల్లడించారు.
పోలీసు గ్రీవెన్స్కు 42 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.
సేవకు పురస్కారాలు
చిత్తూరు ఆర్బన్: పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను సోమవారం ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి తొమ్మిది మందిని ఈ పురస్కారాలు వరించాయి. ఎస్ఆర్.రాజశేఖర్రాజు, ఏఎస్పీకి మహోన్నత సేవా పతకం, జీ,గోపాల్ ఆర్ఎస్ఐ(డీఏఊఆర్)కు ఉత్తమ సేవా పతకం, చిత్తూరు వన్టౌన్ సీఐ ఎన్.మహేశ్వర, ఐరాల ఏఎస్ఐ కే.వేణుగోపాల్నాయుడు, ఎం.పరంధామనాయుడు, ఏఎస్ఐఐ, శ్రీరంగరాజపురం, ఎన్.ఉదయకుమార్, హెచ్సీ, మహిళా పీఎస్, చిత్తూరు, ఎం.ఎస్.సుమన్, ఏఆర్ పీసీ (డీఏఆర్), చిత్తూరు, వి.సురేష్, ఏఆర్ హెచ్సీ (డీఏఆర్), చిత్తూరు, బి.ఢిల్లీ, హెచ్సీ, గుడిపాల పీఎస్కు సేవా పతకాలు వరించాయి.
పశువులకు వ్యాధి నిరోధక టీకాలు
చిత్తూరు కలెక్టరేట్ : పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేయించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.


