చిత్తూరు రూరల్ (కాణిపాకం): ద్విచక్ర వాహన షోరూం డీలర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీటీసీ నిరంజన్రెడ్డి ఆదేశించారు. సాక్షి దినపత్రికలో ఇటీవల ‘దోపిడీ బండి’ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనిపై రవాణశాఖ అధికారులు స్పందించారు. చిత్తూ రు నగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో డీటీసీ సోమవారం షో రూం డీలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు మాత్రమే వసూలు చేయాలని చెప్పారు.
స్ఫూర్తిప్రదాత పొట్టిశ్రీరాములు
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ అన్న పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన మన రాష్ట్రానికే కాకుండా, భారతదేశం గర్వించదగ్గ గొప్ప స్ఫూర్తిప్రదాత అని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
కాల్చి చంపేశారా?
వెదురుకుప్పం: మండలంలోని కొమరగుంట పంచాయతీ బందార్లపల్లె సమీపంలోని మేకలబండ వద్ద గుర్తు తెలియని కాలిన యువకుడి శవం బయట పడడం కలకలం రేపింది. సోమవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్పీ రాజశేఖర్, నగరి ఇన్చార్జి డీఎస్పీ సాయినాథ్, కార్వేటినరగం సీఐ హనుమంతప్ప సిబ్బందితో కలిసి ఘటనా స్థలిలో కాలిన యువకుడి శవాన్ని పరిశీలించారు. అనంతరం నగరి ఇన్చార్జి డీఎస్పీ బందార్లపల్లె రోడ్డు వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువకుడిని ఏదో కారణం చేత చంపి కాల్చినట్లుగా ఆనవాళ్లను బట్టి తెలుస్తోందన్నారు. యువకుడి వయస్సు సుమారు 20 ఏళ్లు ఉండొచ్చని తెలిపారు.
అమ్మ జ్ఞాపకాలతోనే!
నగరి : తెల్లవారితే పదో తరగతి పరీక్షలు. కానీ అంతకుముందు రోజే తల్లి హఠాత్తుగా మరణించింది. గుండె నిండా అమ్మ జ్ఞాపకాలు, కళ్ల నిండా కన్నీళ్లు ఉన్నా.. తన తల్లి చివరి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షకు హాజరైంది. వివరాలు.. నగరి మున్సిపల్ పరిధి నెత్తంకండ్రిగకు చెందిన రైతు రామిరెడ్డి, మునిలక్ష్మి దంపతుల కుమార్తె పూ ర్ణిమ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వ్యవసాయ కూలీలైన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డారు. కాయకష్టం చేసైనా కూతుర్ని ప్రయోజకురాలు చేయాలని తల్లి భావించింది. కానీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పూర్ణిమ తల్లి ఆదివారం అకస్మాత్తుగా మరణించింది. సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. తల్లి మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిని కోల్పోయిన బాధ పూర్ణిమకు తీరని లోటుగా మారింది. అయితే తన తల్లి చివరి కోరిక చదువేనని గుర్తుచేసుకున్న పూర్ణిమ, గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని సోమవారం పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ‘తల్లి కలను నెరవేర్చడమే ఇప్పుడు నా లక్ష్యం’ అనే భావంతో పరీక్ష రాస్తున్న పూర్ణిమ అందరినీ భావో ద్వేగానికి గురిచేస్తోంది.


